అధిక దిగుబడులనాశించి రైతులు విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగు, తెగుళ్ళ మందులు వాడటం వలన పొలాలు నిర్జీవంగా మారుతున్నాయి. బహుళ ప్రయోజనకరమైన సూక్ష్మ జీవులు నశించడం వలన, వాటి ద్వారా లభించాల్సిన సేంద్రీయ పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు పూర్తిగా అదృశ్యమై అనేకరకాలైన పురుగులు, తెగుళ్ళు పంటలను ఆశించడం, పంట పెరుగుదలలో లోపం ఏర్పడటం, మొక్కలలో రోగనిరోధక శక్తి నశించడం, పంట దిగుబడి క్రమేణా తగ్గడం వంటివి జరుగుతున్నాయి. కృత్రిమ వ్యవసాయ విధానాల కన్నా, సహజ సేంద్రీయ వ్యవసాయం అన్ని విధాల మేలని శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం. అందువలన జీవన ఎరువులు, సేంద్రీయ ఎరువులు మంచి ఎరువులు. వాటి గురించి తెలుసుకోవడం అవసరం. వర్మీ కంపోస్ట్ ఒక జీవన ఎరువు వర్మీకల్చర్ అంటే ఏమిటి? వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్ అంటారు. వర్మీకంపోస్ట్ లేదా వానపాముల ఎరువు అంటే ఏమిటి? వానపాములు పనికి రాని సేంద్రీయ వ్యర్థ పదార్థాలను ఆహారంగా స్వీకరించి సారవంతమైన, విలువైన జీవన ఎరువును విసర్జిస్తాయి. దానిని వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువు అంటారు. వర్మీ కంపోస్టు తయారు చేయడం నువ్వు పొరక, అరటి దొబ్బ, జొన్న మొక్క జొన్న చొప్ప, కందిపొరక(కందిపొరకను ముక్కలు ముక్కలుగా చేసి కుళ్ళబెట్టాలి), కలుపు మొక్కలు, తొక్కుడు గడ్డి వంటి వ్యర్థ పదార్థాలతో(బయోమాస్) వర్మికంపోస్టు తయారు చేస్తారు. ముందుగా నేలపై 3 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఒక అడుగు లోతులో గొయ్యి తవ్వి దానిలో ఈ పదార్థాలను పేర్చి దానిపై నీరు చిలకరించి దానిపై చిక్కటి పశువుల పేడ వేయాలి. ఈ విధంగా మూడు సార్లు పొరలను పేర్చుకోవాలి. రెండవ పొర మధ్యలో ఒక్క బెడ్ కు ఆరు కిలోల వానపాములు వేయాలి. బెడ్ లోని పదార్థం ఎరువుగా మారడానికి సుమారు 2 నెలల కాలం పడుతుంది. తరువాత బెడ్ లోని వానపాములను ఏరివేసి ఆ పదార్థాన్ని కొద్దిగా ఆరనిచ్చి జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టగా వచ్చిన పదార్థమంతా తేలికగా ఉంటుంది. అదే వర్మీకంపోస్టు. ఏరేసిన వానపాములతో మళ్ళీ పైన చెప్పిన విధంగా వర్మీకంపోస్టు తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులు సేంద్రీయ ఎరువులు అంటే మానవుల, జంతువులవిసర్జితాలు, చెట్ట్ల వ్యర్థాలు కృశించి నశించగా వచ్చే పదార్థం. అంటే జంతువుల, మానవుల మల మూత్రాలు, కోళ్ళ పెంట, మేకల ఎరువులు, ఎముకల పొడి వంటివి, పొలంలో పంట వ్యర్థాలు, కూరగాయలు పండ్ల వ్యర్థాలు కూడా సేంద్రీయ ఎరువు కిందికి వస్తాయి. వర్షాధారపు పంటలు పండించుకొనే చిన్నకారు రైతులు సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువును వేసుకోవాలి. రసాయన ఎరువులు వాడిన తరువాత వర్షాలు బాగా ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఒకవేళ సరైన వర్షాలు లేకుంటే రసాయన ఎరువులు వాడటం వల్ల నష్టం జరుగుతుంది. కనుక వర్షాధారపు పంటకు రసాయన ఎరువులు వాడరాదు. సేంద్రీయ ఎరువులు వాడటం వలన వర్షాలు తక్కువగా ఉన్నాగాని పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి ఇచ్చి, మంచి చేస్తుంది. దీనిలో సూక్ష్మ పోషకాలు పంట ఉత్పాదకతను పెంచుతాయి. అదేవిధంగా వేపకాయల కషాయం, సీతాఫలాల ఆకుల కషాయం తీసి పంటపై పిచికారీ చేసి, సస్య రక్షణ చేపట్టవచ్చు. దీని వలన అసలు ఖర్చు ఉండదు. సేంద్రీయ ఎరువు వలన ప్రయోజనాలు ఇవి నత్రజని మరియు ఇంకా మిగిలిన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తాయి. నేలలో కరగని పోషకాలను కరిగేటట్లు చేసి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. నేల భౌతిక పరిస్థితిని, ధర్మాలను మెరుగుపరుస్తాయి. నేలలో సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచి, వాటి చర్యలకు తోడ్పడతాయి. రసాయనాల వలన కలిగే హానిని తగ్గిస్తాయి. కానీ, సేంద్రీయ ఎరువులను చాలా ఎక్కువ పరిమాణంలో అంటే టన్నుల లెక్కన వాడాలి. ఇంత ఎక్కువగా దొరకడం కూడా కష్టమే. కొన్ని ఇతర పద్దతుల ద్వారా సేంద్రీయ ఎరువును తయారు చేసుకోవచ్చు. పంటలు కోసిన తరువాత మిగులు పదార్థములు అయిన గడ్డి దుబ్బలు, ఆకులు మొదలగు వాటిని తిరిగి అలాగే నేలలో తొక్కివేయడం ద్వారా కంపోస్ట్ తయారు చేయవచ్చు. దీనిని ఉపయోగించడం వలన భూ భౌతిక, రసాయనిక, జీవన లక్షణాలు మెరుగుపడి భూసార స్థిరీకరణ ద్వారా పంట దిగుబడులు పెరగడానికి వీలు అవుతుంది. వరి గడ్డిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కనుక పొటాష్ లోపం ఉన్న భూముల్లో వరిగడ్డి వాడితే మంచి ఫలితం పొందవచ్చు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువులు చాలా ముఖ్యమైనవి. వీటివలన నేలకు భౌతికంగా, రసాయనికంగా లాభం చేకూరుతుంది. పప్పు జాతికి చెందిన పచ్చి రొట్ట ఎరువులు హెక్టారుకు దాదాపు 40-80 కిలోల నత్రజనిని ఇస్తాయి. పచ్చి రొట్ట కోసమే ఉపయోగించుకోవడానికి జీలుగు, జనుము, పిల్లి పెసర వంటివి ఉన్నాయి. వీటికి పూత రాగానే భూమిలో వేసి కలియ దున్నాలి. ఇవి 100 కేజీలకు పైగా నత్రజని అందిస్తాయి. లేదా గానుగ, జీలుగ, సుబాబుల్ వంటి మొక్కలు రోడ్డు ప్రక్కల పొలాల గట్ల మీద పెంచి వీటి ఆకులను కోసి పొలాలకు పచ్చి ఆకు ఎరువులుగా ఉపయోగించవచ్చు. జీవన ఎరువులు జీవన ఎరువులు అంటే వాటిలో సూక్ష్మ జీవుల జీవకణాలు ఉంటాయి. వీటిలో నత్రజని, భాస్వరం, పోషకాలకు సంబంధించి ముఖ్యమైనవి. జీవన ఎరువులలోని సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరించడమే కాకుండా, మొక్క ఎదుగుదలకు సహాయపడే కొన్ని రకాల విటమిన్లు, హార్మోన్లు, శిలీంద్ర నాశక పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. సూక్ష్మ జీవులు కొన్ని రకాల సేంద్రీయ ఆమ్లాలను నేలలోకి విడుదల చేయడం ద్వారా నేలలు, కరగని భాస్వర పదార్థాలను కరిగేటట్లు చేసి, మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. ఆధారం : శ్రీమతి. బిల్ఖీస్, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కృషివిజ్ఞాన కేంద్రము, బనవాసి, కర్నూలు జిల్లా.